Padma Awards: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలైన ‘పద్మ అవార్డుల’ (Padma Awards) ప్రదానోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ పురస్కారాల ప్రధానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ రంగాలలో దేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన, సమాజానికి విశేష సేవలు అందించిన లబ్ధప్రతిష్టులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయనున్నారు.
మొత్తం 131 మందికి పురస్కారాలు
ఈ ఏడాది వివిధ విభాగాల్లో అసాధారణ ప్రతిభ, అంకితభావాన్ని కనబరిచిన మొత్తం 131 మందిని కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కళలు, సమాజ సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, క్రీడలు, సాహిత్యం-విద్య, వైద్యం, వర్తకం-పరిశ్రమలు వంటి విభిన్న రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి ఈ వేదికపై అత్యున్నత గౌరవం దక్కనుంది.
అవార్డుల వర్గీకరణ వివరాలు ఇలా ఉన్నాయి:
-
పద్మ విభూషణ్: 5 గురు ప్రముఖులకు
-
పద్మభూషణ్: 13 మంది ప్రముఖులకు
-
పద్మశ్రీ: 113 మంది ప్రతిభావంతులకు
దర్బార్ హాల్లో వైభవంగా వేడుక
రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక దర్బార్ హాల్లో ఈ అధికారిక అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర క్యాబినెట్ మంత్రులు, విదేశీ దౌత్యవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరై అవార్డు గ్రహీతలను అభినందించనున్నారు. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన అనామక వీరుల (Unsung Heroes) నుండి లెక్చరర్లు, సెలబ్రిటీల వరకు ఎందరో ఈ వేడుకలో పురస్కారాలు అందుకోనున్నారు.
