Fuel Shortage

Fuel Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు ఆందోళన వద్దు.. సర్కార్ క్లారిటీ!

Fuel Shortage: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై పౌరసరఫరాల శాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోవడంతో, ఆ ప్రభావం మన రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, మిర్యాలగూడ, నిర్మల్‌పై పడిందని.. దీనివల్ల ప్రజల్లో అనవసర భయం మొదలైందని ప్రభుత్వం వివరించింది.

సాధారణంగా బంకుల్లో లీటర్ డీజిల్ రూ. 95 కి దొరుకుతుండగా, ఫ్యాక్టరీలు లేదా పరిశ్రమలకు వాడే డీజిల్ ధర మాత్రం రూ. 150 గా ఉంది. అంటే దాదాపు రూ. 55 తేడా ఉండటంతో, పరిశ్రమల వారు కూడా బంకుల నుంచే డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే వదంతుల వల్ల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల బంకుల వద్ద రద్దీ పెరిగి నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని అధికారులు గుర్తించారు.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చమురు సంస్థలతో మాట్లాడి సరఫరాను భారీగా పెంచింది. సాధారణంగా రోజుకు జరిగే సరఫరా కంటే ప్రస్తుతం డీజిల్ 210 శాతం, పెట్రోల్ 132 శాతం ఎక్కువగా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 పైగా బంకులకు వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా నిరంతరం ఇంధనాన్ని తరలిస్తున్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ముఖ్యంగా వ్యవసాయ పనుల సమయం కాబట్టి హార్వెస్టర్లు, రవాణా వాహనాలకు ఇంధనం అందేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు పనిచేస్తున్నాయి. బంకుల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి 1967 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి ప్రజలు వదంతులు నమ్మకుండా, భయపడి భారీగా నిల్వలు చేసుకోకుండా ఉండాలని ప్రభుత్వం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *