Nara Lokesh

Nara Lokesh: కర్ణాటకలో నారా లోకేష్ పర్యటన.. విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి హామీ!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హోసళ్లి క్యాంప్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్థానిక తెలుగు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు లోకేష్‌కు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రి సంజయ్ సేథ్ కూడా పాల్గొని లోకేష్‌తో కలిసి సందడి చేశారు.

కష్టకాలంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులు

ర్యాలీ అనంతరం జరిగిన సభలో లోకేష్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు గురైనప్పుడు, సింధనూరులోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టి తమకు మద్దతుగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడికి ధన్యవాదాలు తెలియజేయడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని లోకేష్ పేర్కొన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా తమ మూలాలను, మాతృభూమిని మర్చిపోరని ఆయన కొనియాడారు.

విశాఖ ఉక్కుపై కుమారస్వామి కీలక ప్రకటన

ఈ పర్యటనలో కేంద్రమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్లాంట్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపడతామని, కార్మికుల ప్రయోజనాలను కాపాడతామని వెల్లడించారు. లోకేష్ విజ్ఞప్తి మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ – సైనిక్ స్కూల్ ప్రారంభం

ర్యాలీ అనంతరం సింధనూరు సమీపంలోని హోసళ్లిలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు (NTR) కాంస్య విగ్రహాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం, అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇక్కడి విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందాలని ఆకాంక్షించారు.

మంత్రి లోకేష్ రాకతో సింధనూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది తెలుగు యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *