Nagpur: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి వచ్చిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో తీవ్ర కలకలం రేపింది. ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్టు సమాచారం ఇచ్చాడు. దీనితో నగర పోలీసుశాఖ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది.
అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీఎస్), డాగ్ స్క్వాడ్తో కలిసి మంత్రివాసానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. గడ్కరీ నివాసం లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఇంచ్ను జల్లెడ పట్టారు. చివరికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది నకిలీ బెదిరింపు కాల్ అని నిర్ధారణకు వచ్చారు.
ఆకతాయి చర్య.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఈ కాల్ను పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని క్రైమ్ బ్రాంచ్ ద్వారా విచారణ చేపట్టారు. ఫోన్ నంబర్ను ట్రేస్ చేసి, నాగ్పూర్లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న ఓ మద్యం షాపులో పనిచేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తుండగా, అసలు ఈ బెదిరింపు కాల్ వెనక ఉద్దేశమేంటన్నది ఇంకా విచారణలోనే ఉంది.
ప్రజల్లో కలకలం.. నేతల ఆందోళన
ఓ కేంద్ర మంత్రికి ఇలాంటీ బెదిరింపు రావడం, అది నకిలీ అయినా అయినా, భద్రత వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మంత్రి గడ్కరీ కుటుంబానికి ఎలాంటి హానీ జరగకపోవడం ఊరటనిచ్చినా, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
