Crime News: యువత భవిష్యత్తును కబళించే డ్రగ్స్ భూతం, ప్రేమ పేరుతో సాగుతున్న మోసాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తున్నాయో గుంటూరులో వెలుగుచూసిన తాజా ఘటన నిరూపించింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, వాటిని వీడియోలు, ఫోటోలు తీసిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి మనోవేదనతో ఆత్మహత్యకు యత్నించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ప్రేమ ముసుగులో.. డ్రగ్స్ ఉచ్చు
గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలికకు, అదే కళాశాల సీనియర్తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. బాలికను ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన ఆ యువకుడు.. ఆమెను అత్యంత దారుణమైన వ్యసనానికి బానిస చేశాడు. మత్తుపదార్థాలకు అలవాటు చేసి, తన గదికి రప్పించి అసభ్యకర చర్యలకు పాల్పడేవాడు. అప్పటి దృశ్యాలను తన స్నేహితుడి సహాయంతో వీడియోలు, ఫొటోలు తీయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఫోన్లో ఫొటోలు.. తల్లి ఆత్మహత్యాయత్నం
రెండు రోజుల క్రితం బాలిక ఫోన్ పరిశీలించిన తల్లికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూసి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. విషయంపై ప్రశ్నించిన తల్లిదండ్రులపైనే బాలిక ఎదురుదాడి చేయడంతో, మానసిక వేదన తట్టుకోలేని తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: TG Panchayat Elections: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్
విద్యార్థి సంఘ నాయకుడే నిందితుడు
ఈ దారుణంపై సమాచారం అందుకున్న ఈగల్ విభాగ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హుటాహుటిన జీజీహెచ్కు చేరుకుని బాధితురాలి తల్లిని పరామర్శించారు. ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణించి సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, ఈ అకృత్యాలకు పాల్పడిన యువకుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తించారు.
కుటుంబ కలహాలకు కారణం: బాలిక ఆ యువకుడిని ప్రేమిస్తుండగా, అది ఇష్టం లేని తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడుతోందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫోన్లో వీడియోలు, ఫొటోలు చూసి తల్లి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
ఐజీ ఆకే రవికృష్ణ హామీ ఇచ్చిన మేరకు, ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇంటర్ విద్యార్థినిని డ్రగ్స్ మత్తులో ముంచి, ఆమె జీవితాన్ని ఛిద్రం చేసేందుకు ప్రయత్నించిన ఈ ఘటన సమాజంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
