Nara Lokesh: ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమై నేటికి (జనవరి 27, 2026) మూడేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య లోకేష్ కేక్ కట్ చేసి ఈ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
మంగళగిరిలో జరిగిన టీడీపీ కార్యదర్శుల వర్క్షాప్లో లోకేష్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “టీడీపీ నా సొంత ఇల్లు.. ప్రభుత్వం నా కిరాయి ఇల్లు లాంటిది” అని పేర్కొంటూ, పార్టీయే శాశ్వతమని, కార్యకర్తలే అసలైన అధినేతలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేస్తామని, అయితే అధికారంలోకి రాగానే ‘అలక’ అనే జబ్బు వస్తుందని, దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని హితవు పలికారు.
యువగళం – ఒక గేమ్ ఛేంజర్: 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చింది.
- దూరం: 226 రోజుల్లో 3,132 కిలోమీటర్ల నడక.
- వ్యాప్తి: 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా సాగింది.
- ఫలితం: లోకేష్ పాదయాత్ర చేసిన 97 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఏకంగా 90 చోట్ల విజయం సాధించడం విశేషం.
ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వ వేధింపులను తట్టుకుని నిలబడ్డామని, నేడు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నామని లోకేష్ తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను నిలబెట్టుకుంటున్నామని, రాష్ట్రంలో గుంతల పూడ్చేందుకే రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రాజకీయాల్లో యువత, మహిళలకు పెద్దపీట వేస్తామని, పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. మంత్రులు అనిత, సవిత, అచ్చెన్నాయుడు తదితర ముఖ్య నేతలు లోకేష్కు శుభాకాంక్షలు తెలుపుతూ, యువగళం వల్లే నేడు రాష్ట్రంలో ప్రశాంతత నెలకొందని కొనియాడారు.
