Kidnap Case: తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో జరిగిన విద్యార్థి కిడ్నాప్ జరగడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపుతోంది. ఈ కేసులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MA) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ (SFI) నేతలను కిడ్నాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
కిడ్నాప్ కేసులో నిందితులుగా మంచు కుటుంబం
బాధితులు అందించిన ప్రాథమిక ఆధారాలు, వాంగ్మూలం మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మంచు కుటుంబాన్ని కీలక నిందితులుగా చేర్చారు.
- A-1: యూనివర్సిటీ పీఆర్ఓ రవూరు సతీష్
- A-2: మంచు విష్ణు
- A-3: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు
మొత్తం 20 మందిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 191(2), 140(1), 126(2) వంటి కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో పీఆర్ఓ సతీష్తో పాటు 13 మంది బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం సహకారంతోనే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని (Quash) కోరుతూ మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇది ఒక రాజకీయ కుట్ర అని మంచు కుటుంబం ఆరోపిస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్లో ఉండగా, హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వారంలో విచారణకు హాజరుకానున్న విష్ణు
పోలీసుల నోటీసులపై మంచు విష్ణు స్పందిస్తూ, ప్రస్తుతం తనకు కొన్ని ముందస్తు షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగా మరో వారం రోజుల్లో విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం అందించారు.
