Mahesh kumar goud: ఈ టైమ్ కోసం హరీశ్ వేట్ చేస్తుండు..

Mahesh kumar goud: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇంట్లో తలెత్తిన విభేదాలను తట్టుకోలేక, ఇంట్లో మరో అధికార కేంద్రం ఆవిర్భవించడంతో కేటీఆర్ మానసిక సమతుల్యం కోల్పోయి సీఎంపై నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన పొరపాట్లను కవిత బహిరంగంగా ప్రస్తావించారని, ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో కేసీఆర్‌కు నోటీసులు జారీ కావడంతో కేటీఆర్‌లో ఆందోళన మొదలైందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని తెలిపారు. పార్టీ నాయకత్వం కోసం కవిత, కేటీఆర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని, ఇదే సమయం కోసం హరీశ్ రావు కూడా ఎదురుచూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే మూడు ముక్కలు కావడం ఖాయమని, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ చిత్రపటం నుంచి బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఆయన చుట్టూ ఉన్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *