KCR: హైదరాబాద్లోని నందినగర్లో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నివాసంలో ఆదివారం సిట్ (SIT) విచారణ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఒక సందర్భంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
చారిత్రక గదిలో విచారణ – కేసీఆర్ ఆవేదన: తన నివాసంలోని రెండో అంతస్తులో ఉన్న గదిలో ఈ విచారణ జరుగుతోంది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కేసీఆర్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ వ్యూహాలు రచించిన, ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్న అదే గదిలో నేడు ఇలా విచారణ ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. “స్వరాష్ట్ర సాధన కోసం నిద్రలేని రాత్రులు గడిపి పోరాట రచన చేసిన ఈ గదిలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు” అని ఆయన భావోద్వేగంతో అన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల కఠిన ఆంక్షలు: విచారణ ప్రారంభమైన వెంటనే సిట్ అధికారులు నందినగర్ నివాసంలో కఠినమైన నిబంధనలు అమలు చేశారు:
-
నేతల బహిష్కరణ: మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్న ఇతర ముఖ్య నేతలందరినీ అధికారులు నివాసం బయటకు పంపించివేశారు.
-
న్యాయవాదులకు నో ఎంట్రీ: నిబంధనల ప్రకారం విచారణ జరుగుతున్న సమయంలో కేసీఆర్ తరపు న్యాయవాదులు లోపల ఉండటానికి కూడా అధికారులు అనుమతించలేదు.
-
భారీ బందోబస్తు: నందినగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
కేసీఆర్ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుండటంతో, సిట్ అధికారులు ఆయన నుంచి ఎలాంటి కీలక సమాచారం సేకరిస్తారనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
