Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలో ఆమె మీడియాతో మాట్లాడారు.
“ఓరుగల్లు ప్రజలందరూ ఈ డిమాండ్కు మద్దతు ఇవ్వాలి. మామునూర్ ఎయిర్పోర్టుకు తెలంగాణ సాంస్కృతిక గౌరవాన్ని కలిగించే రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ప్రజలు గళమెత్తాలి” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చిన్న అభివృద్ధి పనికైనా గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెడుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని ఆమె మండిపడ్డారు.
“ఒక చిన్న బస్టాండ్ కట్టినా రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లు పెడుతున్నారు. కానీ మేం రాజ్యాన్ని పరిపాలించిన, యుద్ధ వీరురాలైన రాణి రుద్రమదేవి పేరును ఎయిర్పోర్ట్కు పెట్టాలంటున్నాం. ఇది న్యాయం” అని పేర్కొన్నారు. ఈ డిమాండ్ నెరవేరు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని, దీనిపై కేంద్ర మంత్రికి లేఖ రాస్తామని తెలిపారు.
రైతు డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ వైఫల్యం
రైతుల హక్కుల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని తీవ్రంగా విమర్శించారు.
“రైతులు నమ్మినది కాంగ్రెస్.. ఇప్పుడు మోసపోతున్నారు. రెండు లక్షల రుణమాఫీ హామీ అమలు కాలేదు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు.. కానీ రూ.12 వేలు మాత్రమే ఇచ్చారు” అని తెలిపారు.
అలాగే, “స్థానిక సంస్థల ఎన్నికల ముందే రైతు భరోసా పేరిట కొన్ని ప్రణాళికలు ప్రకటించడంతో రైతులు మోసపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతుల గురించి మాట్లాడడమే మానేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.