Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై టీపీసీసీ దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు ఓ వైపు ప్రభుత్వ పాలనపై దృష్టి పెడుతూనే మరో వైపు పార్టీ బలోపేతం చెయ్యేలాని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క తదితరుల సమక్షంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశం కాంగ్రెస్ నేతలు కొత్త ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై చర్చ కొనసాగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై వేరు వేరుగా చర్చ కొనసాగించి కార్యకర్తలను ఉతేజపరిచే ప్రయత్నం చేశారు.
ఖానాపూర్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నడుమ విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వర్గాల మధ్య వర్గ పోరు ఉంది. అలాగే బోథ్ నియోజకవర్గంలో ఆడే గజేందర్, ఎస్. అశోక్ వర్గాల నడుమ, నిర్మల్ నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నడుమ, ముధోల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ నడుమ విభేదాలు ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీర శ్యాం నాయక్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వ ప్రసాద్ నడుమ, సిర్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప కొత్తగా చేరిన సద్దాం మధ్య నడుమ విభేదాలు ఉన్న విషయం చర్చకు వచ్చినట్లు టాక్ నడుస్తోంది.
Adilabad: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఆదిలాబాద్లో శ్రీనివాస్ రెడ్డి, బోథ్లో ఆడే గజేందర్ల మాట చెల్లుబాటు అవుతున్నదని తమ వర్గాలకు కనీస ప్రాధాన్యం దక్కడం లేదని అధిష్టానం దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం… ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సమన్వయం చేయడంలో మంత్రి సీతక్క పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక నుంచి ప్రతినెల నియోజకవర్గాల వారీగా మంత్రి సీతక్క సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారంట.
కాంగ్రెస్లో ఉన్న విభేదాలను పక్కన పెట్టి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని నిర్ణయించారు.
అలాగే పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో అధిష్టానం చొరవ తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ రాష్ట్ర నాయకత్వానికి సూచన చేశారు. విభేదాలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పార్టీ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత నియోజకవర్గాల ఇన్ఛార్జ్లదని చెప్పారు.పార్టీలో ఉన్న విభేదాలను రోడ్డున పడేలా వ్యవహరించవద్దని పార్టీ అగ్ర నేతలు కొంత కటవుగానే హెచ్చరించారంటా…త్వరలోనే పంచాయతీ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ స్టేట్ చీఫ్ సూచన చేశారు.
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రకటించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది చూడాలి మరి పార్టీ నేతలు చెప్పినట్లుగా స్థానిక నేతల మధ్య ఐక్యత ఉంటుందా, కలిసి పని చేస్తారా లేదా ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవరిస్తారా చూడాలి.
రాసినవారు: లక్కాకుల శ్రీనివాస్
మహాన్యూస్ స్టాప్ రిపోర్టర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా..