Aamani: టాలీవుడ్లో ఒకప్పుడు తన నటనతో, అందంతో కుర్రకారును ఉర్రూతలూగించిన స్టార్ హీరోయిన్ ఆమని సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. వెండితెరపై ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, ఇప్పుడు ప్రజా సేవ కోసం రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. నేడు ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు.
కాషాయ కండువా కప్పనున్న రామచందర్ రావు
హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో, బీజేపీ నేత రామచందర్ రావు సమక్షంలో ఆమని పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించనున్నారు. గత కొంతకాలంగా బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలైన ఆమని, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: India T20 World Cup 2026 Squad: నేడే భారత జట్టు ప్రకటన.. గిల్ ఫేట్ మారుతుందా? శాంసన్కు ప్రమోషన్ దక్కుతుందా?
వెండితెర నుంచి రాజకీయ వేదిక వరకు..
‘మిస్టర్ పెళ్ళాం’, ‘శుభలగ్నం’, ‘శుభ సంకల్పం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమని, గత కొన్నేళ్లుగా సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. అయితే, ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు మరియు బుల్లితెర సీరియల్స్లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశంతో ఆమె తన ప్రస్థానాన్ని మరింత విస్తరించుకోనున్నారు.
మీనా చేరికపై సందిగ్ధతకు తెర
గత కొన్ని రోజులుగా సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని, ఆమె అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆమని రాజకీయాల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్లామర్ ఫీల్డ్ నుంచి నాయకులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా, ఆమని లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నటి రాకతో తెలంగాణలో బీజేపీకి మరింత మహిళా మద్దతు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
