Drone Attack: రష్యా రాజధాని మాస్కో పరిసర ప్రాంతాలపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారికంగా ధృవీకరించింది. గాయపడిన కార్మికులు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారత రాయబార కార్యాలయ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
బాధితులకు భారత ఎంబసీ భరోసా
డ్రోన్ దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భారత రాయబార కార్యాలయం, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. “మరణించిన కార్మికుని కుటుంబానికి మా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం. బాధిత కార్మికులకు అవసరమైన వైద్య సహాయం, ఇతర సదుపాయాలు అందేలా చూడటానికి సదరు కంపెనీ యాజమాన్యంతో పాటు స్థానిక రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం” అని ఎంబసీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా బాధితుల వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
మాస్కోపై చరిత్రలోనే అతిపెద్ద దాడి
రష్యా రాజధాని ఇంకా దాని పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, ఇటీవలి నెలల్లోనే ఉక్రెయిన్ తన అతిపెద్ద వైమానిక దాడిని శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభించింది.
-
రష్యా క్లెయిమ్: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 1,000 కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
-
మాస్కోలో అలర్ట్: కేవలం మాస్కో నగరం వైపు దూసుకొచ్చిన 81 డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.
ఈ దాడుల వల్ల నివాస భవనాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో భారతీయ కార్మికుడితో పాటు మొత్తం నలుగురు మరణించారు. మాస్కోకు ఉత్తరాన ఉన్న ఖిమ్కిలో నివాస గృహంపై డ్రోన్ శిథిలాలు పడి ఒక మహిళ, అలాగే మైతిష్చి జిల్లాలోని పొగోరెల్కి గ్రామంలో ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. మాస్కో ఆయిల్ రిఫైనరీ సమీపంలో కూడా కొందరు గాయపడినట్లు సమాచారం.
రష్యా దాడులకు ప్రతీకారమే.. అన్న జెలెన్స్కీ
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్పై అత్యంత భారీ వైమానిక దాడులకు పాల్పడిన కొన్ని రోజులకే ఈ డ్రోన్ దాడి జరగడం గమనార్హం. యుద్ధాన్ని పొడిగిస్తూ తమ నగరాలపై రష్యా చేస్తున్న దాడులకు ఈ విధంగా సమాధానం చెప్పడం పూర్తిగా సమర్థించదగినదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యా భూభాగంలో 500 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి మరీ తాము లక్ష్యాలను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఆయన క్లెయిమ్ చేశారు.
మరోవైపు, ఈ దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇదొక ‘భారీ ఉగ్రవాద దాడి’ అని, ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా పౌరులను టార్గెట్ చేస్తోందని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు.

