India vs South Africa 3rd ODI

India vs South Africa 3rd ODI: వైజాగ్‌లో భారత్-దక్షిణాఫ్రికా పోరు! ప్లేయింగ్ XIలో కీలక మార్పులు

India vs South Africa 3rd ODI: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తుది, నిర్ణయాత్మక మ్యాచ్ డిసెంబర్ 6, శనివారం నాడు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా, ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సిరీస్‌ విజేతను నిర్ణయించే ఈ ‘విన్నర్స్ టేక్ ఆల్’ పోరులో టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. రెండో వన్డేలో భారత్ 359 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి చవిచూడడంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ పేలవ ప్రదర్శన ప్రధాన కారణంగా నిలిచింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో, కర్ణాటకకు చెందిన ఈ పేసర్ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు రెండు తీసినా, అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 10 పరుగులు దాటడం కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఆగ్రహం తెప్పించింది. తొలి వన్డేలోనూ అతని ఎకానమీ ఆరు పరుగుల కంటే ఎక్కువే ఉంది.

ప్రసిద్ధ్‌ స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో, నితీష్ రెడ్డి రూపంలో భారత్‌కు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడే ఆప్షన్ దొరుకుతుంది. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. తొలి రెండు వన్డేల్లో బ్యాట్‌తో రాణించడంలో విఫలమైన సుందర్‌, బౌలింగ్‌లో కూడా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. రాంచీలో మూడు, రాయ్‌పూర్‌లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు.

Also Read: The Ashes 2025-26: యాషెస్‌ సిరీస్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

రిషబ్ పంత్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు బెంచ్‌కే పరిమితమైన నేపథ్యంలో, సుందర్ స్థానంలో వీరిలో ఒకరిని తీసుకుని బ్యాటింగ్ యూనిట్‌ను బలోపేతం చేయాలని జట్టు భావిస్తోంది. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరినీ పక్కన పెడితే, సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత్‌కు ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోతుంది. ఆ పరిస్థితుల్లో, నితీష్ కుమార్ రెడ్డి ఐదవ బౌలింగ్ ఆప్షన్‌గా మారతాడు. కెప్టెన్, హెడ్ కోచ్ ఈ కీలక మ్యాచ్ కోసం ఎంతటి “బోల్డ్ కాల్” తీసుకుంటారో చూడాలి. మరోవైపు, ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లు చేసినప్పటికీ, వైజాగ్‌లో అతనే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే, రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మూడో వన్డే కోసం భారత్ అంచనా వేసిన ప్లేయింగ్ XI:

యశస్వి జైస్వాల్

రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీ

రుతురాజ్ గైక్వాడ్

తిలక్ వర్మ

కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్)

రవీంద్ర జడేజా

నితీష్ కుమార్ రెడ్డి

హర్షిత్ రాణా

కుల్దీప్ యాదవ్

అర్ష్‌దీప్ సింగ్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *