Hyderabad: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్ పాస్ల ధరలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు జూన్ 9 (సోమవారం) నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెంపు సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా ప్రభావం చూపనుంది. సగటున 20 శాతానికి పైగా ధరలు పెరిగాయి.
పాత ధరలతో పోలిస్తే కొత్త ధరలు ఇలా ఉన్నాయి:
ఆర్డినరీ బస్ పాస్: పాత ధర – రూ. 1,150 → కొత్త ధర – రూ. 1,400
మెట్రో ఎక్స్ప్రెస్ పాస్: పాత ధర – రూ. 1,300 → కొత్త ధర – రూ. 1,600
మెట్రో డీలక్స్ పాస్: పాత ధర – రూ. 1,450 → కొత్త ధర – రూ. 1,800
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగించే ఇతర పాస్లు, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను కూడా టీజీఆర్టీసీ సవరించింది. నెలవారీ పాస్లపై ఆధారపడే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు ఈ పెంపు భారం కానుంది. ఇప్పటికే జీవన వ్యయం పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం పలు విమర్శలకు తావిస్తుంది.
ఇక హైదరాబాద్ మెట్రో రైలు కూడా ఇటీవలి రోజుల్లో టిక్కెట్ ధరలు పెంచింది. ఏడు సంవత్సరాల తర్వాత ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ మే 17న తొలిసారిగా టిక్కెట్ ధరలు పెంచింది. ప్రారంభంలో 20 శాతం పెంచిన తరువాత, ఆ ఒత్తిడిని తగ్గిస్తూ 10 శాతం తగ్గింపు ప్రకటించింది.
ఇటువంటి తరచూ జరిగే ధరల పెంపుతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరుగుతున్న సంగతి అంతా ఇంతా కాదు.
