Housemaid Urine Cooking: దేశ రాజదాని ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వార్త విని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఒక బడా వ్యాపారి ఇంట్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వంటమనిషి ఒక అసహ్యకరమైన పనిచేసింది. ఆమె చేసిన వంట తిని ఆ వ్యాపారి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అనారోగ్యం పాలయ్యారు. ఇంట్లో అందరికీ లివర్ ఇన్ఫెక్షన్ సమస్య వచ్చింది. చాలా రోజులుగా చికిత్స తీసుకుంటున్నా వారికి ఇన్ఫెక్షన్ తగ్గలేదు. దీంతో ఆ బడా వ్యాపారి ఎందుకిలా జరుగుతోందని ఆరా తీయగా.. అతని ఇంట్లో పనిమనిషి వంటలో మూత్రం కలిపేదని తెలిసింది.
గాజియాబాద్ జిల్లాలోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతానికి చెందని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని కుటుంబం అంతా గత నెల రోజులుగా లివర్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు. లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ల వద్ద కుటుంబమంతా చికిత్స్ పొందుతున్నారు. కానీ ఇన్ని రోజులుగా డాక్టర్ సూచించిన మందులు తింటున్నా వారందరి ఆరోగ్యం మెరుగుపడలేదు. పైగా ఇంకా క్షీణిస్తోంది. దీంతో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి డాక్టర్లు వారంతా తినే ఆహారంలో ఏదో కల్తీ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
డాక్టర్లు చెప్పింది విని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి బయటి ఆహారం తినడం మానేశాడు. కుటుంబసభ్యులందరూ ఇంట్లో చేసిన వంట మాత్రమే తినాలని చెప్పాడు. డాక్టర్లు సూచించిన ఆహారం మాత్రమే అది కూడా ఇంట్లో వండిన ఆహారమే అందరూ తింటున్నా గత వారం రోజులుగా వారి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. ఆ వ్యాపారి కొడుకు ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో ఆ వ్యాపారికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చివరికి అతనికి తన వంట మనిషిపై అనుమానం వచ్చింది. తాము కేవలం ఇంట్లో చేసిన వంట మాత్రమే తింటుండడంతో అతను వంటింట్లో రహస్యంగా ఒక కెమెరా పెట్టాడు. అక్కడ పనిమనిషి భోజనం ఎలా చేస్తోందో చూడాలని అలా చేశాడు.
అయితే ఆ రహస్య కెమెరాలోని దృశ్యాలు చూసి అతనికి చెమలు పట్టాయి. అతని ఇంట్లోని వంటమనిషి తన మూత్రం కలిపి వంట చేస్తున్నట్లు అర్థమైంది. వీడియోలో ఆమె తన మూత్రం ఒక వంట పాత్రలో పోసి అందులో కొంత నీరు కూడా కలిపి చపాతి పిండి కలపడానికి ఆ నీరు ఉపయోగించింది. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో తీసుకొని ఆ వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీడియో ఆధారంగా ఆ వంటమనిషిని అరెస్ట్ చేశారు.