High Court: తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో రాష్ట్ర హైకోర్టు తాజాగా ఒక సంచలన ఆదేశాన్ని జారీ చేసింది. ఇకపై ఏదైనా సినిమాకు సంబంధించి టికెట్ ధరలు పెంచాలనుకుంటే, ఆ ఉత్తర్వులను కనీసం 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను కోర్టు స్పష్టం చేసింది. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలయ్యే కొన్ని రోజుల ముందు ప్రభుత్వం ఇలాంటి అనుమతులు ఇస్తుంటుంది. అయితే, ఇకపై ఈ ప్రక్రియలో ముందస్తు ప్రణాళిక ఉండాలని కోర్టు సూచించింది.
ఈ వివాదం ప్రధానంగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే సినిమా టికెట్ ధరల పెంపుతో మొదలైంది. ఈ చిత్రానికి రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే ‘రాజాసాబ్’ సినిమా టికెట్ల విషయంలో వాదనలు జరుగుతున్న సమయంలోనే, ప్రభుత్వం ఈ సినిమాకు సంబంధించి రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేయలేదని ఆయన వాదించారు.
దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించిన హైకోర్టు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందో వివరిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. సినిమా ప్రేక్షకులకు భారం పడకుండా, పారదర్శకమైన విధానం ఉండాలన్నదే కోర్టు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ కేసుపై తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
