Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం.. 31 మంది మృతి..!

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో వరుణుడు విలయతాండవం సృష్టిస్తున్నాడు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొండచరియలు విరిగిపడి, ఆకస్మిక వరదలు సంభవించడంతో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు ఇరుక్కుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

వైష్ణోదేవి ఆలయ మార్గంలో విషాదం

కత్రాలోని ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు మృతి చెందడం విషాదం. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు మూసివేశారు.

జీలం నది ఉగ్రరూపం – 3,500 మందిని తరలింపు

దక్షిణ కశ్మీర్‌లోని జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముప్పు కారణంగా 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లేహ్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు పూర్తిగా అంతరాయం కలిగాయి.

ఇది కూడా చదవండి: Vinayaka Chavithi 2025: తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

కమ్యూనికేషన్ నిలిచిపోయిన ప్రాంతాలు

వర్షాల దెబ్బకు బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో పలు జిల్లాల్లో ఫోన్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్షలాది మంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయారు.

సీఆర్పీఎఫ్ జవాన్ల రక్షణ

పంజాబ్‌లోని వరదలతో మునిగిపోయిన గ్రామంలో చిక్కుకున్న 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హెలికాప్టర్ సాయంతో ఆర్మీ రక్షించింది. అలాగే, పంజాబ్‌లోని సట్లెజ్‌, బియాస్‌, రావి నదులు ఉగ్రరూపం దాల్చగా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోనూ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

విద్యా సంస్థలకు సెలవులు – రైలు రవాణాకు భారీ అంతరాయం

జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ (ఆగస్టు 27) సెలవులు ప్రకటించారు. 10వ, 11వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఉత్తర రైల్వే 22 రైళ్లను రద్దు చేయగా, 27 రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేసింది. ముఖ్యంగా పఠాన్‌కోట్–కండ్రోరి మధ్య రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *