Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం చాలా వింత వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల గాలిలో హుమిడిటీ బాగా పెరిగిపోయి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితులే ఉంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రతతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 64 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఎండలు చాలా ఎక్కువగా ఉండి, ఉష్ణోగ్రతలు 45 నుండి 46 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు. అలాగే విజయనగరం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం వంటి జిల్లాల్లో 43 నుండి 44 డిగ్రీలు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు ఎండలు మండుతాయని పేర్కొన్నారు.
రైతులకు, పశుకాపరులకు ముఖ్య గమనిక: ఉరుములు, మెరుపులు మొదలైనప్పుడు పొలాల్లో ఉండకండి. ఆకాశం మేఘావృతమై ఉరుముల శబ్దం వినబడగానే వెంటనే సురక్షితమైన ఇళ్లు లేదా భవనాల్లోకి వెళ్ళిపోండి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఎండలతో పాటు వర్షాలు కూడా పడనున్నాయి. శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులు పడవచ్చు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎవరూ చెట్ల కింద, కరెంట్ స్తంభాల కింద లేదా పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డుల కింద నిలబడకూడదని అధికారులు గట్టిగా చెబుతున్నారు.
ఇటు తెలంగాణలో కూడా ఎండల తీవ్రతతో పాటు పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మంచి నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లాలి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతూ శరీరాన్ని కాపాడుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
