Harish Rao: సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించగా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకున్నప్పటికీ, ఇప్పటి వరకు ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు పూర్తిచేసి, తమమే ఉద్యోగాలను కల్పించామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఫలితం లేకుండా పోయాయని, ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం వంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. చిన్న ఉద్యోగాలను కూడా తక్కువగా చూడకూడదని హరీశ్ రావు సూచించారు. టాటా, బిర్లా వంటి పెద్ద వ్యాపారవేత్తలు కూడా చిన్న ఉద్యోగాలతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించారని గుర్తు చేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని పిలుపునిచ్చారు.
జాబ్ మేళాలో సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ కు చెందిన సల్మా నేహా అనే మహిళ నాలుగు ఉద్యోగ అవకాశాలు సాధించిందని హరీశ్ రావు ప్రశంసించారు.
