Gold Price Today: భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. పుట్టినరోజు వేడుక నుంచి పెళ్లి వరకు ఏ శుభకార్యం జరిగినా పసిడి ఉండాల్సిందే. కష్టకాలంలో కొండంత అండగా నిలిచే ఆర్థిక భరోసా కూడా ఇదే. అయితే, గత కొంతకాలంగా సామాన్యులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం కూడా ధరలు స్వల్పంగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతుండటంతో, ధరలు పెరిగినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది.
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ధరల వివరాల్లోకి వెళ్తే.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 పెరిగి రూ. 1,53,940 కి చేరుకుంది. అదేవిధంగా, సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ. 10 పెరగడంతో ప్రస్తుతం రూ. 1,41,110 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. గతేడాది లక్ష రూపాయల లోపు ఉన్న తులం బంగారం ధర, ఇప్పుడు ఏకంగా లక్షన్నర దాటడం గమనార్హం.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,090 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,260 వద్ద ఉంది. ఇక చెన్నైలో మిగిలిన నగరాల కంటే ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,140 గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,42,210 గా ఉంది. ప్రాంతాన్ని బట్టి పన్నులు, ఇతర ఛార్జీల వల్ల ఈ స్వల్ప మార్పులు కనిపిస్తుంటాయి.
బంగారంతో పాటే వెండి ధరలు కూడా పైపైకి కదులుతున్నాయి. తాజాగా కిలో వెండిపై రూ. 100 పెరగడంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ. 2,65,100 కి చేరింది. అంటే ప్రస్తుతం తులం వెండి కొనాలంటే రూ. 2,651 వెచ్చించాల్సిందే. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య గొడవలు, మరియు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వంటి కారణాల వల్ల ధరలు ఇలా విపరీతంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
