Weather : ఫెంగల్ తుఫాన్ తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో తడ దగ్గర జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాన నీరు నిలిచింది. జిల్లాలోని సూళ్లూరుపేట తడ, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, ఏర్పేడు, నారాయణవనం, కేవీబీపురం మండలాల పరిధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో.. గూడూరు, కోట, వాకాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిపై తుఫాను విరుచుకుపడింది. భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తమిళనాడులో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. బలమైన గాలులు వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరెంటు షాక్తో ముగ్గురు మరణించారు. ఇక 14 గంటల తర్వాత చైన్నై విమానాశ్రయం తెరుచుకున్నది. ఎయిర్పోర్టులోకి నీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. పలు విమానాలను రద్దుచేశారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఎయిర్పోర్టులో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.