ED: శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు, తాపడాల చోరీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మంగళవారం ఉదయం నుంచే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ప్రధానంగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్, నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై అధికారులు దృష్టి సారించారు.
అయ్యప్ప స్వామి ఆలయంలోని వివిధ కళాఖండాల నుండి బంగారాన్ని సేకరించి, దానిని దుర్వినియోగం చేశారనే బలమైన ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. గతంలో దేవస్వం బోర్డులో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నేరపూరిత కుట్ర పన్ని ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసును కేరళ హైకోర్టు పర్యవేక్షణలో రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తుండగా, నిధుల మళ్ళింపు కోణంలో ఈడీ తన దర్యాప్తును వేగవంతం చేసింది.
ఇది కూడా చదవండి: Jio Hotstar Plans: జియో హాట్ స్టార్ సరికొత్త మార్పులు.. హాలీవుడ్ కంటెంట్ పై కండిషన్స్
ఇప్పటికే ఈ కేసులో ఆలయ ప్రధాన పూజారితో సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమాల్లో మాజీ అధికారుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా విచారణ జరుపుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు త్వరలోనే శబరిమల ఆలయంలో నేరుగా తనిఖీలు చేపట్టనున్నారు. అయితే, ఈ కేసులో ఉన్న రాజకీయ సున్నితత్వం మరియు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, దీనిని సీబీఐ (CBI) కి అప్పగించాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ తాజా సోదాలతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
