Dk shivakumar: కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీ సోషల్ మీడియా పోస్టులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వాగతించాల్సిందేనని పేర్కొన్న ఆయన, అయితే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. “స్కామ్ లార్డ్” పేరుతో బీజేపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ చేసిన పోస్టులపై కర్ణాటక కాంగ్రెస్ ఇప్పటికే బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఆరోపణలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసినవని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై ఇలాంటి పోస్టులు పెట్టడం వ్యక్తిత్వ హత్యకు సమానమని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
సమాజంలో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ తరహా సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
