Minister Lokesh

Minister Lokesh: విశాఖలో కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం – లోకేష్

Minister Lokesh:  విశాఖపట్నంలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయం  అందుబాటులోకి వచ్చింది. రుషికొండ ఐటీ పార్క్‌ హిల్–2లోని మహతి ఫిన్‌టెక్‌ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ కార్యాలయం దాదాపు వెయ్యి సీట్ల సామర్థ్యంతో రూపొందించబడింది. ప్రారంభోత్సవంలో ఎంపీ శ్రీభరత్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇక శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన కార్యక్రమం జరగనుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 21.31 ఎకరాల్లో, మూడు దశల్లో రూ.1,583 కోట్ల వ్యయంతో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునిక ఐటీ–డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కేంద్రాన్ని సంస్థ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించింది.

Also Read: Goa Nightclub Fire: గోవా నైట్‌క్ల‌బ్ అగ్నిప్ర‌మాదానికి కార‌ణం సిలిండ‌ర్ పేలుడు కాదా?

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక మొత్తం 8,000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఇందులో, తొలి దశను 2029 నాటికి పూర్తిచేసి 3,000 మందిని నియమించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని మూడు దశలను 2033 నాటికి ముగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ప్రారంభ కార్యక్రమానికి ముందు మంత్రి లోకేశ్‌ విశాఖ టీడీపీ కార్యాలయాన్ని సందర్శించి, ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. పింఛన్లు, స్థానిక సమస్యలు, సేవల నియామకాలు వంటి అంశాలపై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేశ్‌ విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులతో చర్చలు జరగగా, అనేక సంస్థలు విశాఖలో తమ కార్యాచరణ విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. ఇదే దిశగా ఈ రోజు జరిగిన కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం కీలక అడుగుగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *