Revanth Reddy: తెలంగాణ అభివృద్ధి, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ విద్యా-క్రీడా సంస్థలతో భాగస్వామ్యమే లక్ష్యంగా చేపట్టిన విదేశీ పర్యటనలో అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
యూకే పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రాల కలయికే దేశాభివృద్ధి – మా పర్యటనలో దాపరికం లేదు
-
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్: కేంద్రం వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో పనిచేస్తుంటే.. దానికి అనుగుణంగానే మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్మ్యాప్తో ముందుకెళ్తున్నాం. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను హైదరాబాద్కు రప్పించడమే మా లక్ష్యం. విదేశీ పర్యటన పూర్తి షెడ్యూల్, ఆహ్వానాలు, ఎజెండాను కేంద్రానికి ముందే సమర్పించాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు.
-
యూకేకు అనుమతిచ్చి.. యూఎస్కు ఎందుకు అడ్డుకున్నారు?: ఒకే దరఖాస్తులో యూకే, అమెరికా పర్యటనల వివరాలు ఇచ్చాం. ఇంగ్లాండ్కు అనుమతినిచ్చి, అమెరికాకు వచ్చేసరికి ‘పొలిటికల్ యాంగిల్’ పేరుతో తిరస్కరించడం కేంద్రం వివక్షకు నిదర్శనం. నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిననే ఈ వివక్ష చూపుతున్నారు.
-
గుజరాత్ ఆధిపత్యం – తెలంగాణపై చిన్నచూపు: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గుజరాత్ సీఎంకు విదేశీ పర్యటనలకు చకచకా అనుమతులు ఇస్తారు. గతంలో కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులకు కూడా అనుమతులిచ్చారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ సీఎం వెళ్తే తప్పేంటి? తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఓర్వలేరా? తెలంగాణ బీజేపీ ఎంపీలు గుజరాత్ ఆధిపత్యానికి మద్దతిస్తున్నారా? అని సీఎం ప్రశ్నించారు.
పర్యటనను అడ్డుకోవచ్చు.. ఆలోచనను కాదు
కేంద్రం తన పర్యటనను ఆపినప్పటికీ తన లక్ష్యం ఆగలేదని సీఎం స్పష్టం చేశారు..
-
యూఎస్కు వెళ్లిన అధికారుల బృందం: తాను వెళ్లలేకపోయినా రాష్ట్ర ఉన్నతాధికారుల బృందాన్ని అమెరికాకు పంపామని, ప్రఖ్యాత వర్సిటీలతో ఎంవోయూలు ఖరారు అవుతాయని తెలిపారు. లండన్లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రతినిధులతో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
-
పార్లమెంట్లో నిలదీస్తాం: ఈ అంశాన్ని పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తుతామని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణిని సభలో ప్రశ్నిస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
