Cm chandrababu: 1/70 చట్టంపై సీఎం బాబు కీలక కామెంట్స్..

Cm chandrababu:;ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని, గిరిజనుల హక్కులను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

భారతీయ సంస్కృతిని పరిరక్షించాలంటే గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అనివార్యమని తాము బలంగా నమ్ముతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందువల్ల గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని వివరించారు.

గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. అరకు కాఫీతో పాటు ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెం. 3 ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా చర్యలు తీసుకున్నామని, అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ ఉత్తర్వు న్యాయపరమైన చిక్కుల్లో పడిపోయి రద్దయిందని తెలిపారు. దాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న భావనతోనే 1/70 చట్టాన్ని తీసుకువచ్చారని, ఆ చట్టాన్ని మార్చే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు. సమాజంలో అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *