Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాట పట్టారు. అమరావతి అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను గాడిలో పెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం మర్యాదపూర్వక భేటీలు మాత్రమే కాకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల పురోగతిపై ఈ పర్యటనలో ఆయన గట్టిగా ఫోకస్ చేయనున్నారు.
కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ పర్యటనలో ఆయన ఎజెండా చాలా స్పష్టంగా ఉంది.
ఎజెండాలో టాప్ – పోలవరం!
రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఈ పర్యటనలో ప్రధానాంశం.
-
పురోగతి & పునరావాసం: ప్రాజెక్టు పనుల వేగం పెంచడంతో పాటు, అత్యంత కీలకమైన పునరావాస (R&R) ప్యాకేజీపై కేంద్రంతో చర్చించనున్నారు.
-
రెండో దశ పనులు: ప్రాజెక్టు రెండో దశకు సంబంధించిన అనుమతులు, నిధుల విడుదలపై సంబంధిత కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగే సమావేశం రాజకీయంగా, పాలనాపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
పారిశ్రామిక వేత్తలతో ‘బిజినెస్’ భేటీ
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో జరగనున్న సీఐఐ (Confederation of Indian Industry) వార్షిక సదస్సులో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఏపీలో ఉన్న అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌలభ్యాలను పారిశ్రామిక దిగ్గజాలకు వివరించడం ద్వారా రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులను తీసుకురావాలన్నది ఆయన వ్యూహం.
వెంటే ఉన్న ‘బృందం’
ముఖ్యమంత్రితో పాటు ఈ పర్యటనలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మరియు ఇతర ఉన్నత స్థాయి అధికారులు హస్తినకు వెళ్తున్నారు. క్షేత్రస్థాయి గణాంకాలతో సిద్ధంగా ఉన్న ఈ బృందం, కేంద్రం ముందు రాష్ట్ర అవసరాలను బలంగా వినిపించనుంది.
