Neet Paper Leak

Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!

Neet Paper Leak: మే 3న జరిగిన నీట్-యూజీ (NEET-UG 2026) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) శనివారం మరో కీలక అరెస్ట్ చేసింది. నేషనల్ Testing ఏజెన్సీ (NTA) క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న బోటనీ (వృక్షశాస్త్ర) ప్రొఫెసర్ మనీషా మాంధారేను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆమెను సుదీర్ఘంగా విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

బయాలజీ ప్రశ్నల లీకేజీకి ప్రధాన సూత్రధారి

నీట్-యూజీ 2026 పరీక్షకు సంబంధించిన బయాలజీ (బోటనీ, జువాలజీ) ప్రశ్నల లీకేజీకి ఈమెనే ప్రధాన మూలమని, మరో మాస్టర్‌మైండ్‌ అని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రధాన సూత్రధారి, రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణితో పాటు ఇతరులను విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా మనీషా మాంధారేను అరెస్ట్ చేశారు.

పుణేలోని ‘మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్’లో ఆమె లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. గత ఐదు నుండి ఆరేళ్లుగా ఎన్టీఏ తరఫున నీట్ ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఆమె నిపుణురాలిగా (ఎక్స్‌పర్ట్) వ్యవహరిస్తున్నారు.

రహస్య కోచింగ్.. లక్షల్లో వసూళ్లు

ఈ ఏడాది నీట్ పరీక్షలో బోటనీ, జువాలజీ ప్రశ్నలను రూపొందించడంలో మనీషా మాంధారే కీలక పాత్ర పోషించారు. పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉండటం వల్ల ఆమెకు ప్రశ్నపత్రాలపై పూర్తి యాక్సెస్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని, పరీక్షకు ముందే ఏప్రిల్ 2026లో పుణేలోని తన నివాసంలో కొందరు ఎంపిక చేసిన విద్యార్థులకు ఆమె రహస్యంగా కోచింగ్ క్లాసులు నిర్వహించారు.

ఆ క్లాసుల్లో ఆమె నీట్ పరీక్షలో రాబోయే ప్రశ్నలను, వాటి సమాధానాలను విద్యార్థులకు డిక్టేట్ చేశారు. ఈ లీక్ చేసిన ప్రశ్నల కోసం విద్యార్థుల నుండి లక్షల రూపాయలను ఫీజుగా వసూలు చేశారు.

విద్యార్థులతో ఆ ప్రశ్నలను నోట్‌బుక్స్‌లో రాయించడమే కాకుండా, టెక్స్ట్‌బుక్స్‌లో కూడా మార్క్ చేయించారు. మే 3న జరిగిన అసలు పరీక్షలోని ప్రశ్నలు, ఈమె లీక్ చేసిన ప్రశ్నలతో పూర్తిగా సరిపోలాయని సీబీఐ స్పష్టం చేసింది.

ఒకే తరహా వ్యూహం (Modus Operandi)

ఈ రహస్య క్లాసుల కోసం విద్యార్థులను సమీకరించడంలో మనీషా వాగ్మారే అనే మరో నిందితురాలు (మే 14న అరెస్ట్ అయ్యారు) మనీషా మాంధారేకు సహాయం చేసింది. అంతకుముందు కెమిస్ట్రీ పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణి కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. ఆయనకు కూడా విద్యార్థులను తీసుకురావడంలో ఇదే వాగ్మారే సహాయపడింది. కులకర్ణిని సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

14 రోజుల కస్టడీ కోరిన సీబీఐ

నిందితులు పీవీ కులకర్ణి, మనీషా వాగ్మారేలను శనివారం ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నీట్ పేపర్ లీక్ వెనుక ఉన్న పెద్ద కుట్రను, మరిన్ని లింకులను ఛేదించాల్సి ఉందనే కారణంతో నిందితులను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. దర్యాప్తులో భాగంగా నిందితులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి రావచ్చని కోర్టుకు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *