Ap news: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్లను సోషల్ మీడియా మాధ్యమాల్లో నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారంటూ ఏయూ లా కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు.ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానని పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష టీడీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను టార్గెట్గా చేసుకొని వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు నోటీసులు అందిన వారి జాబితాలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి కూడా ఉన్నాడు.