Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 53.47 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పాలనాపరమైన సంస్కరణలు, రాజకీయ వ్యూహాల మేళవింపుగా ఈ బడ్జెట్ కనిపిస్తోంది. ముఖ్యంగా రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి పెద్దపీట వేశారు.
బడ్జెట్ లెక్కలు ఇలా ఉన్నాయి: మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 53.47 లక్షల కోట్లు కాగా, దేశ ఆర్థిక స్థితిగతులను సూచించే కీలక గణాంకాలను మంత్రి వెల్లడించారు. ఇందులో ద్రవ్య లోటు రూ. 16.95 లక్షల కోట్లుగా ఉంది.
రంగాల వారీగా కేటాయింపులు (ముఖ్యమైనవి):
- రవాణా రంగం: రూ. 5.98 లక్షల కోట్లు (అత్యధిక కేటాయింపు)
- రక్షణ రంగం: రూ. 5.94 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి: రూ. 2.73 లక్షల కోట్లు
- వ్యవసాయం: రూ. 1.62 లక్షల కోట్లు
- విద్య: రూ. 1.39 లక్షల కోట్లు
- వైద్యం, ఆరోగ్యం: రూ. 1.04 లక్షల కోట్లు
ఇది కూడా చదవండి: Stock Market Crash: బడ్జెట్ దెబ్బ.. స్టాక్ మార్కెట్ విలవిల.. కుప్పకూలిన బ్రోకరేజ్ స్టాక్స్!
తెలుగు రాష్ట్రాలకు వరాలు: ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రాధాన్యత లభించింది. ఏడు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లను ప్రకటించారు, ఇవి తెలుగు రాష్ట్రాల మీదుగా సాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ మినరల్స్’ వెలికితీత కోసం ప్రత్యేక మైనింగ్ మిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది పారిశ్రామిక వృద్ధికి కొత్త ఊపునివ్వనుంది.
కీలక పథకాలు – సంస్కరణలు:
- ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0: దేశాన్ని చిప్ తయారీ కేంద్రంగా మార్చేందుకు రూ. 40,000 కోట్లు కేటాయించారు.
- బయోఫార్మా శక్తి: రూ. 10,000 కోట్లతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించి, ఫార్మా రంగంలో పరిశోధనల కోసం 3 కొత్త జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయనున్నారు.
- కొత్త ఆదాయపు పన్ను చట్టం: ‘న్యూ ఇన్కమ్ టాక్స్ యాక్ట్-2025’ను ప్రకటించారు. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పన్ను విధానాన్ని సరళతరం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
మొత్తానికి, మౌలిక సదుపాయాల కల్పన (రవాణా), టెక్నాలజీ (సెమీకండక్టర్), మరియు సామాన్యుల సంక్షేమాన్ని సమతూకం చేస్తూ ప్రధాని మోదీ మార్క్తో ఈ బడ్జెట్ రూపొందింది.
