BRS: బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన 400 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీ భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సిల్వర్ జూబ్లీ వేడుకలు – భారీ ఏర్పాట్లు
బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్థానిక ఎన్నికల వ్యూహం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ను సిద్ధం చేయడంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడంతో పాటు, బలమైన వ్యూహాలను రూపొందించేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ
ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సభలో బీఆర్ఎస్ నాయకత్వం భవిష్యత్ రాజకీయ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తుందని అంచనా.
ఏప్రిల్ 27న ప్రతినిధుల సభ
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ప్రతినిధుల సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వడంతో పాటు, పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ఈ సమావేశాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ పునరుద్ధరణకు కసరత్తు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.