Chinese Manja: పండుగ పూట సరదాగా ఆడుకోవాల్సిన పిల్లాడు, గాలిపటం దారం కారణంగా ఆసుపత్రి పాలైన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడకు చెందిన నాలుగేళ్ల బాలుడు శ్రీహాస్, తన ఇంటి ముందు ఆడుకుంటుండగా గాలిలో ఎగురుకుంటూ వచ్చిన చైనా మాంజా మెడకు చుట్టుకుంది. ఆ దారం బలంగా కోసుకుపోవడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్లోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బాలుడి మెడకు ఏకంగా 20 కుట్లు వేశారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ఈ చైనా మాంజా ఎందుకు ఇంత ప్రమాదకరం అంటే.. దీనిని సాధారణ నూలు దారంతో కాకుండా నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారు. దీనికి పదును పెంచడం కోసం గాజు పొడిని పూస్తారు. ఇది ఎంత బలంగా ఉంటుందంటే, మనుషుల చర్మాన్ని, పక్షుల రెక్కలను క్షణాల్లో కోసేస్తుంది. అందుకే, పర్యావరణానికి మరియు ప్రాణకోటికి ముప్పుగా మారిన ఈ దారాన్ని ప్రభుత్వం 2016లోనే నిషేధించింది. అలాగే 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా దేశవ్యాప్తంగా దీని వాడకంపై నిషేధం విధించింది.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా.. రహస్యంగా ఈ మాంజా విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. గాలిపటాలు ఎగురవేసే వారు కేవలం తమ వినోదం కోసం చూస్తున్నారే తప్ప, అది ఇతరుల ప్రాణాల మీదకు వస్తుందని ఆలోచించడం లేదు. కేవలం చిన్న పిల్లలే కాదు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు, పక్షులు కూడా ఈ దారం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాలు ఉన్నప్పటికీ, ప్రజల్లో మార్పు రానంత కాలం ఇలాంటి విషాదాలు జరుగుతూనే ఉంటాయని ఈ ఘటన గుర్తు చేస్తోంది.
పండుగ సంబరాలు జరుపుకునే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గాలిపటాలు ఎగురవేసే వారు పర్యావరణానికి హాని చేయని సాధారణ కాటన్ దారాలను మాత్రమే వాడాలి. నిషేధిత చైనా మాంజాను అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మన చిన్న సరదా మరొకరి జీవితాన్ని బలి తీసుకోకూడదని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.
