Bomb Threat: ఇటీవలి ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో ప్రయాణికులు సతమతమవుతోన్న తరుణంలో, విమానాలకు వస్తున్న వరుస బాంబు బెదిరింపులు దేశీయ విమానయాన రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఇవాళ ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సిబ్బందికి ఆగంతకుల నుంచి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ అందింది. ఈ మెయిల్లో ఏకంగా రెండు అంతర్జాతీయ విమానాల్లో బాంబు ఉందంటూ పేర్కొనడం సంచలనం సృష్టించింది.
కువైట్-హైదరాబాద్ (KU-373) ఫ్లైట్ మరియు బ్రిటిష్ ఎయిర్వేస్ (BA 277) విమానం (లండన్-శంషాబాద్)లో బాంబులు ఉన్నాయనే సమాచారంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది సలహా మేరకు, కువైట్-హైదరాబాద్ విమానాన్ని పైలట్లు హుటాహుటిన సమీపంలోని మస్కట్కు మళ్లించారు. మరోవైపు, లండన్ నుంచి వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఇది కూడా చదవండి: New York Fire Accident: బర్మింగ్హామ్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి
ల్యాండింగ్ అయిన వెంటనే, విమానంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబ్ స్క్వాడ్తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీని, విమానంలోని ప్రతి మూలనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, ఈ బెదిరింపు వెనుక ఉన్న వాస్తవాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వరుస బెదిరింపుల నేపథ్యంలో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
