Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసాన్ని పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్ నాగ్పూర్లో పెద్ద కలకలం రేపింది. ఈరోజు ఉదయం 8:46 గంటలకు గడ్కరీ ఇంటిని 10 నిమిషాల్లో పేల్చివేస్తామని ఒక దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సమాచారంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.
వెంటనే పట్టుబడ్డ నిందితుడు
బెదిరింపు కాల్ వచ్చిన కొద్దిసేపటికే పోలీసులు వేగంగా స్పందించారు. ఉమేష్ విష్ణు రౌత్ అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. మహల్లోని తులసి బాగ్ రోడ్లో నివసించే రౌత్, మెడికల్ చౌక్ దగ్గర ఉన్న ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను తన మొబైల్ ఫోన్ నుంచే ఈ బెదిరింపు కాల్ చేసినట్లు తేలింది. పోలీసులు నిందితుడిని గుర్తించి నాగ్పూర్లోని బీమా దవాఖానా సమీపంలో అరెస్టు చేశారు.
నిజం కాని బెదిరింపు.. గడ్కరీ సురక్షితం
ఈ బెదిరింపు కాల్ వచ్చిన సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్లోనే ఉన్నారు. ఆయన సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 112 అత్యవసర హెల్ప్లైన్కు వచ్చిన కాల్ ఆధారంగా బాంబు స్క్వాడ్ను వెంటనే రంగంలోకి దించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) జోన్ 1 రిషికేశ్ రెడ్డి తెలిపారు. అయితే, విస్తృత తనిఖీలు నిర్వహించిన తర్వాత, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఆ కాల్ బూటకమని తేలింది.
దర్యాప్తు కొనసాగుతోంది
నిందితుడైన ఉమేష్ విష్ణు రౌత్కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపు వెనుక అసలు కారణాలు ఏమిటి, నిందితుడు ఎందుకు ఇలా చేశాడనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భద్రతను మరింత పటిష్టం చేశారు.
