BJP: ఇప్పుడు దేశంలో బీజేపీ హవా నడుస్తున్నది. ఆ హవాలో ధనస్వామిక పార్టీగా కూడా అది అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా నిలిచి రికార్డ్ను సొంతం చేసుకున్నది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశాన్ని అత్యధిక కాలం ఏలిన, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే చాలా వెనుకబడి ఉండటం గమనార్హం.
BJP: 2024 మార్చి 31 నాటికి బీజేపీ వద్ద రూ.7,113.80 కోట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తన నివేదికలో పొందుపర్చింది. అదే కాంగ్రెస్ పార్టీ వద్ద కేవలం రూ.857 కోట్లు ఉన్నాయని తెలుస్తున్నది. ఈసీ తన నివేదికలో ఆయా పార్టీల ఆదాయంతోపాటు ఖర్చు వివరాలను కూడా పొందుపర్చింది.
BJP: ఎన్నికల కమిషన్కు వివిధ పార్టీలు అందించిన వార్షిక గణాంకాల ప్రకారం.. బీజేపీకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,685.69 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో అదే బీజేపీకి రూ.1,294 కోట్లు వచ్చాయి. అదే విధంగా నిరుడు రూ.2,042.75 కోట్ల మేర, 2022-23లో రూ.648.42 కోట్ల మేర విరాళాలు అందుకున్నట్టు బీజేపీ తన వార్షిక నివేదికలో పేర్కొన్నది.
BJP: కాంగ్రెస్ పార్టీకి 2024 మార్చి 31 నాటికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.828.36 కోట్లు వచ్చాయని ఎన్నికల సంఘం నివేదిక తెలిపింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 2023-24లో విరాళాల ద్వారా వచ్చిన రూ.1129.67 కోట్లతో కలిపి మొత్తం రూ.1225.11 కోట్లు వచ్చినట్టు ఈసీకి ఇచ్చిన ఆడిట్ నివేదికలో ఆ పార్టీ పేర్కొన్నది.
BJP: ఇటీవల జరిగిన 2023-24 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 1,754.06 కోట్లు ఖర్చు చేసిందని ఈసీ తెలిపింది. అదే 2022-23లో చేసిన ఖర్చు రూ.1,092 కోట్ల కంటే ఇది 60 శాతం ఎక్కువని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 2022-23లో రూ.192.56 కోట్లు ఖర్చు చేయగా, అదే 2023-24లో రూ.619.67 కోట్లు ఖర్చు చేసిందని వివరించింది.
BJP: ఒక ఏడాది కాలంలో ప్రకటనల కోసం బీజేపీ రూ.591 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా కోసం రూ.434.84 కోట్లు, ప్రింటెడ్ మెటీరియల్ కోసం రూ.115.62 కోట్లు ఖర్చు చేసింది. అదే పార్టీ 2023-24లో విమాన రాకపోకల కోసం రూ.174 కోట్లు ఖర్చు చేసింది. 2022-23లో రూ.78.23 కోట్లు ఖర్చు చేసింది. అభ్యర్థులకు రూ.191.06 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. అంతకు ముందు ఏడాది రూ.75.05 కోట్లు ఇచ్చింది. 2024లో సమావేశాల కోసం బీజేపీ రూ.84.32 కోట్లు, 2023-24లో మోర్చాలు, ర్యాలీలు, ఆందోళనలు, కాల్ సెంటర్ల నిర్వహణకు రూ.75.14 కోట్లు ఖర్చు చేసింది.
BJP: మరోవైపు కాంగ్రెస్ 2023-24లో ఎలక్ట్రానిక్ మీడియాపై రూ.207.94 కోట్లు, ప్రింటెడ్ మెటీరియల్ కోసం రూ.43.73 కోట్లు ఖర్చు చేసింది. అదే ఏడాది విమాన రాకపోకల కోసం రూ.62.65 కోట్లు ఖర్చు చేసింది. అభ్యర్థులకు రూ.238.55 కోట్ల ఆర్థికసాయం అందజేసింది. 2024 మార్చి 31 నాటికి ప్రచార ఖర్చుల కోసం రూ.28.03 కోట్లు, సోషల్ మీడియా కోసం రూ.79.78 కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 2 కోసం రూ.49.63 కోట్లు ఖర్చు చేసినట్టు తన ఆడిట్ నివేదికలో కాంగ్రెస్ పేర్కొన్నది. అంతకు ముందు తొలి భారత్ జోడో యాత్ర కోసం రూ.71.84 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.
ఇలా ఆయా ఖర్చులు, ఆదాయాలను బట్టి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ.. దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా నిలిచిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఆ మేరకు ఆ పార్టీ వద్ద రూ.7,113.80 కోట్లు, కాంగ్రెస్ వద్ద రూ.857 కోట్లు ఉన్నాయని తేల్చి చెప్పింది.