PM Modi Temple

PM Modi Temple: బంగారు విగ్రహంతో గుడి.. రూ.112 కోట్లతో ఆలయ నిర్మాణం..?

PM Modi Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిలువెత్తు బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయనకు ఏకంగా ఓ భవ్య దివ్య మందిరాన్ని (ఆలయాన్ని) నిర్మించాలంటూ బీహార్ రాష్ట్ర కిన్నర్ (ట్రాన్స్‌జెండర్) సంక్షేమ బోర్డు సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా తమ సమాజానికి దక్కని హక్కులు, గౌరవం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్లే సాధ్యమయ్యాయని బోర్డు సభ్యులు తెలిపారు. జూలై 29న జరిగిన బోర్డు తొలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించగా, త్వరలోనే ఇది రాష్ట్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌కు చేరనుంది.

ఆలయ ప్రతిపాదన – ప్రధాన ముఖ్యాంశాలు..

ప్రధాని మోదీ ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం నుంచి 5 ఎకరాల స్థలం, దాదాపు రూ.112 కోట్ల నిధులు కేటాయించాలని బోర్డు సభ్యుడు రాజన్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయంలో మోదీ నిలువెత్తు బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోకపోతే భక్తులు, ప్రజల నుంచి మిగిలిన మొత్తాన్ని సమీకరిస్తామని చెప్పారు.

మా తలరాత మార్చింది మోదీనే” – కిన్నర్ బోర్డు సభ్యుడు రాజన్ సింగ్..

బోర్డు ప్రతినిధి రాజన్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.. 2019లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ తమ జీవితాల్లో కీలక మార్పులు తెచ్చిందన్నారు. ఈ చట్టం ఫలితంగానే నేడు బీహార్‌లో హిజ్రాలు సబ్-ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు, వైద్యులు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని, బోర్డుల్లో సభ్యులుగా ప్రాతినిధ్యం పొందుతున్నారని కొనియాడారు.
 
ట్రిపుల్ తలాక్, హలాలా వంటి దురాచారాలను రద్దు చేసి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రధాని కృషి చేశారని పేర్కొన్నారు.

ప్రభుత్వ సహకారంపై ధీమా..

ప్రభుత్వం స్థలం, నిధులు కేటాయిస్తుందా అనే ప్రశ్నకు రాజన్ సింగ్ బదులిస్తూ.. ప్రభుత్వం కచ్చితంగా సహకరిస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందన్నారు. మోదీకి కృతజ్ఞతగా, ఆయనను దేవుడిగా భావిస్తూ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *