Bangladesh Crisis: పొరుగు దేశం బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిణామాలు భారతదేశ భద్రతకు, వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్గా మారనున్నాయి. 1971 బంగ్లా విముక్తి యుద్ధం తర్వాత భారత్ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఇదేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢాకాలో భారత్ తన పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ కీలక నివేదికను సమర్పించింది.
1971 vs 2024: సవాల్ స్వరూపం మారింది
కమిటీ విశ్లేషణ ప్రకారం.. 1971లో ఎదురైన సవాల్ ఒక కొత్త దేశ ఆవిర్భావానికి, మానవతా దృక్పథానికి సంబంధించింది. కానీ, ప్రస్తుత సవాల్ మరింత ప్రమాదకరమైనది.
బంగ్లాదేశ్లోని యువత ఆలోచనా ధోరణిలో మార్పు రావడం. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, అక్కడ ఏర్పడుతున్న కొత్త రాజకీయ వ్యవస్థ భారత్కు దూరంగా జరిగే అవకాశం ఉండటం.
చైనా, పాకిస్థాన్ల ‘డబుల్ గేమ్’
బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు, పాకిస్థాన్తో పెరుగుతున్న సాన్నిహిత్యంపై ప్యానెల్ గట్టిగా హెచ్చరించింది. ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాలలో చైనా జోక్యం భారత్ చుట్టూ ‘బిగిస్తున్న ఉచ్చు’గా కనిపిస్తోంది:
-
మోంగ్లా పోర్ట్: రేవు పట్టణాలపై చైనా పట్టు.
-
లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్: గగనతల భద్రతపై ప్రభావం.
-
పెకువా జలాంతర్గామి స్థావరం: బంగాళాఖాతంలో చైనా నౌకాదళ కదలికలకు అవకాశం.
ఇది కూడా చదవండి: Youtuber: యూట్యూబర్ కి ఎక్కడివి? లాంబో.. బెంజ్ కార్లు సీజ్..
అంతేకాకుండా, చైనా అక్కడ కేవలం ప్రభుత్వంతోనే కాకుండా ‘జమాతే ఇస్లామీ’ వంటి మతతత్వ శక్తులతో కూడా సంబంధాలు నెరుపుతుండటం గమనార్హం.
పెచ్చరిల్లుతున్న రాడికల్ శక్తులు
బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలోపేతం కావడం భారత్కు కంటిమీద కునుకు లేకుండా చేసే అంశం. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధ సంకేతాలు వెలువడటం, రాబోయే ఎన్నికల్లో అందరినీ కలుపుకుపోయే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుందా? అన్న సందేహాలను కమిటీ లేవనెత్తింది.
భారత్ ఏం చేయాలి? ప్యానెల్ సిఫార్సులు:
భారత్ తన వ్యూహాన్ని తక్షణమే పునఃసమీక్షించుకోకపోతే యుద్ధం లేకుండానే ప్రాధాన్యతను కోల్పోతుందని కమిటీ స్పష్టం చేసింది.
ఓడరేవుల యాక్సెస్, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా బంగ్లాదేశ్కు గట్టి భరోసా ఇవ్వాలి. విదేశీ శక్తులు (చైనా, పాక్) బంగ్లాలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా నిశితంగా పర్యవేక్షించాలి. బంగ్లాలోని అన్ని రాజకీయ వర్గాలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది.
