Bapatla: చీరాలలో పండుగ దుస్తులు కొనేందుకు వెళుతున్నాం…త్వరగా వచ్చేస్తాను.. వచ్చి తర్వాత ఆడుకుందాం.. అని చెప్పి వెళ్లిన ఆ బాలుడు ఇంతలోనే ఇక లేడనే విషయం తెలియటంతో స్నేహితులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో సందడిగా ఉండే ఆ చిన్నారి మృతితో విలపించారు. క్రిస్మస్ వెలుగులతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు చీకటిమయంగా మారింది.
Bapatla: మరో రెండు రోజుల్లో ఆనందంగా పండుగ జరుపుకోబోయే కుటుంబంలో విధి చిన్నచూపు చూసింది. బాపట్ల జిల్లా ఆనందనగర్కు చెందిన ఆరెతోటి ప్రవీణ్కుమార్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. అత్త కుమారై అయిన చీరాలకు చెందిన దివ్యను 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారై జెస్సీ, కుమారుడు రాహుల్ ఉన్నారు. పాప ఆరో తరగతి, బాబు అయిదో తరగతి చదువుతున్నాడు.
ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి
Bapatla: క్రిస్మస్ పండుగ కావడంతో కావాల్సిన దుస్తులు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేయడానికి నలుగురు బైకుపై చీరాలకు వచ్చారు. స్థానికంగా ఉన్న బంధువులను కలిశారు. ఆ తర్వాత కావాల్సిన వాటిని కొనుగోలు చేసుకుని తిరిగి బాపట్లకు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ఆర్టీసీ పక్కన ఉన్నఆర్వోబీ మీద నుంచి కారంచేడు గేటు వద్దకు వెళుతున్నారు.
Bapatla: ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో కుమారుడు పక్కకు పడటంతో అతని తలపై నుంచి బస్సు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే బాలుడు తనువు చాలించాడు. భార్యాభర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ ఎం. శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
