Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతి ప్రాంతంపై టీవీ చానల్ ద్వారా జర్నలిస్టు ముసుగులో ఓ విశ్లేషకుడు చేసిన అసభ్య వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా భావించరాదని, దీని వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిలో నివసిస్తున్న మహిళలను కించపరిచేలా, బౌద్ధ ధర్మానికి మూలస్థలంగా ఉన్న ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విలువలను అవహేళన చేసేలా ప్రసారమైన ఈ వ్యాఖ్యలపై అధికార యంత్రాంగం సీరియస్గా స్పందించాలని ఆయన హితవు పలికారు. “ఒకరిని మాత్రమే కాదు, ఓ ప్రాంత ప్రజల మొత్తం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇది,” అని పవన్ పేర్కొన్నారు.
పవిత్రమైన బౌద్ధ సంప్రదాయానికి పుట్టినిల్లు అయిన అమరావతి — మహాయాన బౌద్ధంపై ప్రభావం చూపిన ఆచార్య నాగార్జునుని అడుగులదారినే. మౌర్యుల నుంచి కాకతీయుల వరకు ఎన్నో చారిత్రక శాసనాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ రచనల ప్రకారమే ఈ ప్రాంతం బౌద్ధ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అంతటి వారసత్వాన్ని కలిగిన అమరావతిని అవమానించే ప్రయత్నం బౌద్ధ అనుయాయుల మనసులను తీవ్రంగా గాయపరుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో 32 శాతం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలవారు, 14 శాతం బీసీలు, 20 శాతం రెడ్డిలు, 18 శాతం కమ్మలు, 9 శాతం కాపులు, 3 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం కులపరంగా వర్ణించి, దుష్ప్రచారం చేస్తూ వారికి మానసిక హింసను కలిగించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
“ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని కేవలం వ్యక్తులుగా కాక, వారి వెనక ఉన్న కుట్రల ముఠాలను గుర్తించాలి. ఇది అమరావతిని కించపరిచే, ప్రజా రాజధానిని అపవిత్రం చేయాలనే అశుభ ప్రయత్నం. ప్రభుత్వం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది,” అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.