CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలో పలు కీలక పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఈ నెల 28న ఆయన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రామజన్మభూమిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అయోధ్య పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అధికారులు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
అయోధ్య పర్యటనకు ముందు మంగళవారం రోజు సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. అక్కడ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా నిర్వహిస్తున్న ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సమ్మేళనం మంగళవారం నుంచి 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రసంగం చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు.
Also Read: Retirement: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్
సమ్మేళనం అనంతరం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సోమవారం నుంచే అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పోలీసులు భద్రతను పటిష్టం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన పూర్తయ్యే వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా బందోబస్తు కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనల నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.
