Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు (ఏప్రిల్ 20) అమరావతిలోని ‘అన్న క్యాంటీన్’ను సందర్శించారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన అక్కడ సామాన్య ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఈరోజు రోజంతా ప్రజలకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రూ. 76 లక్షల భారీ విరాళం
ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ. 76 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు 76వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, ప్రతి ఏటూ ఒక లక్ష చొప్పున ఈ మొత్తాన్ని ఆమె విరాళంగా ఇచ్చారు. ఈ నిధులను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అన్న క్యాంటీన్ల బలోపేతానికి ఖర్చు చేయనున్నారు. పేదల ఆకలి తీర్చడంలో భువనేశ్వరి చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
అన్నదానం ఒక ప్రజా ఉద్యమంగా మారాలి
అన్న క్యాంటీన్లో అల్పాహారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆకలితో ఎవరూ అలమటించకూడదన్నదే తన ప్రధాన ఆశయమని ఆయన పేర్కొన్నారు. “రాష్ట్రంలో ప్రస్తుతం 269 అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. త్వరలోనే మరో 5 కొత్త క్యాంటీన్లను ప్రారంభిస్తాం” అని సీఎం వెల్లడించారు. కేవలం ఆహారం అందించడమే కాకుండా, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, పౌష్టికాహారాన్ని పేదలకు అందించడమే ఈ పథకం ప్రత్యేకత అని ఆయన వివరించారు.
అన్నదానం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజంలో స్థోమత ఉన్న ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు అన్నదానానికి ముందుకు రావాలని, భువనేశ్వరిని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తమ జీవితంలోని శుభకార్యాల సందర్భంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి పేదల ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పేదల ముఖంలో చిరునవ్వు కోసం..
గతంలో అన్న క్యాంటీన్లను మూసివేసినా, ప్రజల అవసరాల దృష్ట్యా తాము మళ్లీ వీటిని పునరుద్ధరించామని చంద్రబాబు గుర్తు చేశారు. తిండి లేక ఎవరూ బాధపడకూడదనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని క్యాంటీన్లలో ఉచిత భోజనం ఏర్పాటు చేయడంతో వేలాది మంది పేదలు లబ్ధి పొందారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజున ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
