Ap cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖలకు సంబంధించిన పలు ముఖ్య అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై 14 అంశాలు ఎజెండాగా పెట్టారు.
కేబినెట్ ఆమోదం తెలిపిన ముఖ్య నిర్ణయాలు:
1. అమరావతిలో ఇంజనీరింగ్ పనులకు ఆమోదం
రూ.2,700 కోట్ల విలువ గల రెండు ఇంజనీరింగ్ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.సీఆర్డీఏ పరిధిలో రూ.2,700 కోట్ల మేర పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది.
2. మున్సిపల్ చట్ట సవరణలు
2016లో అమలులోకి వచ్చిన ఏపీ ఎంఆర్డీయే చట్టంలో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగించే సవరణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
3. విభిన్న అభివృద్ధి ప్రాజెక్టులు
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 కొత్త పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంచే నిర్ణయానికి ఆమోదం.
4. నూతన ప్రాజెక్టుల చర్చలు
రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ మరియు కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై కేబినెట్ చర్చ చేసింది.
నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది.ఈ సమావేశంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించే అవకాశముంది.