Pawan Kalyan: తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్గా, రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారిక ప్రవేశం లభించింది. సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ మీద మక్కువ పెంచుకున్న పవన్, గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న నిరంతర సాధన మరియు పరిశోధనలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది.
జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సోగో బుడో కన్రి కై’ సంస్థ నుంచి పవన్ కళ్యాణ్కు ‘ఫిఫ్త్ డాన్’ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ ప్రముఖుడు ఆయనే కావడం విశేషం. అలాగే, జపాన్ వెలుపల ‘తకెడా షింగెన్’ వంశపు యుద్ధ సంప్రదాయాల్లోకి ప్రవేశం పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల చూపిస్తున్న అంకితభావానికి మెచ్చిన ‘గోల్డెన్ డ్రాగన్స్’ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదును అందజేసింది.
ఇది కూడా చదవండి: Cyber Scam: సేవ చేద్దామని వస్తే.. రూ. 15 కోట్లు దోపిడీ!
పవన్ కళ్యాణ్ కేవలం ఏదో సరదా కోసం కాకుండా, శాస్త్రీయంగా ఈ యుద్ధకళలను అభ్యసించారు. ప్రముఖ బుడో నిపుణుడు డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద ఆయన ‘కెండో’లో సమగ్ర శిక్షణ పొందారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ మనకు ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘ఓజీ’ వంటి సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జపాన్ సమురాయ్ యుద్ధ రీతులను తెలుగు తెరపైకి పరిచయం చేసిన మొదటి హీరో ఆయనే. ఈ కొత్త గుర్తింపు ద్వారా సినిమా, రాజకీయం మరియు యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ ఒకేచోట మేళవించగల అరుదైన భారతీయ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచారు.
Come, witness the most memorable part of Shri Pawan Kalyan’s Martial Arts Journey.#PKMartialArtsJourney pic.twitter.com/Z3D27hD2Uh— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 11, 2026
