Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, వెంటనే సస్పెండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే వివరణను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వానికి మరియు పార్టీకి చెడ్డపేరు తెచ్చే నేతల తీరుపై చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్పీ ఆఫీసులో అసలేం జరిగింది?
నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన వ్యక్తి పేరును ఎందుకు ఖరారు చేయలేదంటూ ఆయన ఎస్పీ కృష్ణారావుతో వాగ్వాదానికి దిగారు. మార్చి 31న ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన ఎమ్మెల్యే, సుమారు 10 గంటల పాటు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. మంత్రులు ఫోన్ చేసినా స్పందించకుండా, ఆర్డర్ కాపీ ఇచ్చే వరకు కదిలేది లేదని పట్టుబట్టడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో సీఎం తీవ్రంగా స్పందించారు.
ఇటుక ఇటుక పేర్చి కడుతుంటే.. పాడు చేస్తారా?
పార్టీలోని కొందరు నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టలేనని చంద్రబాబు ఖరాకండిగా చెప్పారు.
మేము ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే, కొందరు మాత్రం తమ ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థలతో ఘర్షణ పడితే సహించేది లేదు అని సీఎం హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మిగిలిపోవాలనుకుంటున్నారా లేక సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా అనేది వారి ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని హితవు పలికారు.
క్రమశిక్షణ విషయంలో ఇకపై రెండో ఆలోచన ఉండదని, గీత దాటితే పునరాలోచన లేకుండా పార్టీ నుంచి పంపించేస్తామని తేల్చి చెప్పారు.
వ్యవస్థలను గౌరవించాలి
ప్రభుత్వ అధికారులు ఇంకా పోలీసు వ్యవస్థలతో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సొంత పనుల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం, కార్యాలయాల్లో ధర్నాలకు దిగడం వంటి చర్యలు కూటమి ప్రభుత్వ విధానాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. అరవిందబాబు ఉదంతాన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలని మిగిలిన నేతలకు కూడా పరోక్షంగా సందేశం పంపారు.
