Operation Sindoor: 2025 మే 7 తెల్లవారుజామున 2 గంటల నుండి 3 గంటల మధ్య, భారత వైమానిక దళం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoJK) ప్రాంతాల్లోకి ప్రవేశించి భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. “ఆపరేషన్ సిందూర్” పేరుతో ప్రారంభించిన ఈ ఆపరేషన్, ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టబడింది. ఆ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం పాకిస్తాన్లోని ప్రముఖ ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు జరిపి అనేక స్థావరాలను నాశనం చేసింది. మొదటి దశలో మొత్తం 9 ప్రాంతాల్లో గగనతల దాడులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.
విమాన ప్రయాణాలపై ప్రభావం – ఉత్తరభారతంలో విమానాశ్రయాలు మూత
భారత వైమానిక దాడుల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలచే దేశవ్యాప్తంగా విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ లాంటి ప్రధాన విమానయాన సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది.
In view of the prevailing situation, Air India has cancelled all its flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot – till 12 noon on 7 May, pending further updates from authorities.…
— Air India (@airindia) May 6, 2025
బికనీర్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల సహా అనేక నగరాలకు విమానాలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లోని విమానాశ్రయాలు తదుపరి సమాచారం వరకు మూసివేయబడినట్లు ప్రకటించారు. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తప్పకుండా తమ విమాన సర్వీసులపై తాజా సమాచారం తెలుసుకోవాలని సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
#6ETravelAdvisory: Due to changing airspace conditions in the region, our flights to and from #Srinagar, #Jammu, #Amritsar, #Leh, #Chandigarh and #Dharamshala are impacted. We request you to check your flight status at https://t.co/CjwsVzFov0 before reaching the airport.
— IndiGo (@IndiGo6E) May 6, 2025
అంతర్జాతీయ స్పందన – ఖతార్ ఎయిర్వేస్ సేవలు నిలిపివేత
పాక్ గగనతలంలోని ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ ఎయిర్వేస్ పాకిస్తాన్కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ప్రధానం అని పేర్కొన్న సంస్థ, పరిస్థితిని సమగ్రంగా గమనిస్తున్నామని వెల్లడించింది.
LOC వద్ద తీవ్ర ఉద్రిక్తతలు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నియంత్రణ రేఖ (LOC) వెంబడి రెండు దేశాల మధ్య భారీగా షెల్లింగ్ కొనసాగుతోంది. భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై జరిపిన ఈ దాడితో బోర్డర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలలో ఆందోళన నెలకొంది.
గమనిక: ప్రయాణికులు, పౌరులు తక్షణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకే ముందడుగు వేయాలి.