Grand Father Love: సాధారణంగా ప్రియురాలు చనిపోయిందని తెలిసి ప్రియుడు లేదా ప్రియుని మోసం ప్రియురాలు మరణించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి భర్త చనిపోతే ఆ బాధ భరించలేక భార్యలు తనువు చాలించడం కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. బిడ్డ బాధ తట్టుకోలేక తల్లి గుండె ఆగిన వార్తలూ వింటూ ఉంటాం. కానీ, మనవడు చనిపోయాడని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తాత గురించి ఎప్పుడూ వినపడలేదు. ఇదిగో ఇప్పుడు అలాంటి తాత కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఏవో కారణాలతో తన భార్యను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఇద్దరికీ అంతిమ సంస్కారాలు జరిపించారు. ఇంతలో, ఆ వ్యక్తి తాత తన మనవడి చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. ఆ ఘటన పూర్తి వివరాలు ఇవే..
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో బహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రామంలో తాతా-మనవడు సంఘటన జరిగింది. అభయ్ రాజ్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య సవితా యాదవ్ను గొడ్డలితో నరికి చంపి, ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ అంత్యక్రియల దగ్గరకు వచ్చారు. అయితే, అభయ్ రాజ్ తాత మాత్రం ఇంటి వద్దనే ఉండిపోయాడు. అంత్యక్రియల అనంతరం బంధువులు అంతా వెళ్లిపోయారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి అభయ్ రాజ్ తాత రామావతార్ యాదవ్ కనిపించలేదు. దీంతో అతని కోసం కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. ఎంత వెతికినా అతను కనిపించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా అభయ్ రాజ్ దంపతుల అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి అందరూ అవాక్కయ్యారు. అభయ్ రాజ్ చితి పైనే అతని తాత రామావతార్ యాదవ్ మృతదేహం పాక్షికంగా కాలిపోయి కనిపించింది.
ఇది కూడా చదవండి: Level Crossing: రైలు గేటు పడిన ఫస్ట్రేషన్ లో ఈ వ్యక్తి చేసిన పని చూడండి.. వార్నీ ఎవడేండీడు అని ముక్కున వేలేసుకుంటారు
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. తన మనవడు అంటే ఆ తాతకు పిచ్చి ప్రేమ అని.. తన మనవడు ఒక్కరోజు కనిపించకపోయినా విపరీతంగా బాధపడేవాడనీ.. ఆ మనవడు కూడా తాత అంటే ప్రాణం పెట్టేవాడిని కుటుంబ సభ్హ్యులు తెలిపారు. మనవడు చనిపోయిన బాధ తట్టుకోలేక తాత కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.