South Africa: దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా సమీపంలో దారుణమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సాల్స్విల్ టౌన్షిప్లోని అనుమతులు లేని ఒక బార్ (షిబీన్) లో శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు – ఒక 12 ఏళ్ల బాలుడు, ఒక 16 ఏళ్ల బాలిక, ఒక మూడేళ్ల చిన్నారి – ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Nikhita Nagdev: న్యాయం చేయండి మోదీ జీ: పాక్ మహిళ విజ్ఞప్తి
విచక్షణారహితంగా కాల్పులు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ అక్రమ బార్లోకి ముగ్గురు సాయుధులు చొరబడ్డారు. ఆ సమయంలో సుమారు 25 మంది అక్కడ మద్యం సేవిస్తున్నారు. దుండగులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో, 10 మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దర్యాప్తు ప్రారంభం: నిందితుల కోసం గాలింపు
ఈ కాల్పులకు పాల్పడిన దుండగులు ఎవరు, దీనికి కారణాలు ఏమిటనే వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

