Nara Lokesh

Nara Lokesh: ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా పర్యటన

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, కెనడా పర్యటన చేపట్టారు. డిసెంబర్ 6 నుండి 10వ తేదీ వరకు సాగే ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలలో పాల్గొననున్నారు.

తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేశ్
పర్యటనలో భాగంగా శనివారం (డిసెంబర్ 6) ఉదయం లోకేశ్ అమెరికాలోని డల్లాస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎన్నారై తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు ప్రవాసాంధ్రులకు ఈ వేదికగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో ఫొటో దిగే అవకాశం, ఉచిత భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

డల్లాస్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నప్పుడు 100 మందికి పైగా అభిమానులు స్వాగతం చెప్పడంతో అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారని, చట్టపరమైన సమస్యలు రాకుండా వేరే గేటు ద్వారా వెళ్లమని సూచించారని లోకేశ్ ఈ సమావేశంలో పంచుకున్నారు.

Also Read: PM Modi: గోవా అగ్నిప్రమాద ఘటన..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ

శాన్‌ఫ్రాన్సిస్కోలో టెక్ దిగ్గజాలతో భేటీ
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో, లోకేశ్ సోమ, మంగళవారాల్లో (డిసెంబర్ 8, 9) శాన్‌ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. అధిక వృద్ధి ఉన్న రంగాలలో కొత్త పెట్టుబడులు పెట్టాలని, అలాగే కొత్త భాగస్వామ్యాలు, టెక్నాలజీ సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకోవాలని కంపెనీలను కోరుతున్నారు.

గతంలో గూగుల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలతో జరిగిన సమావేశాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో, ఈసారి కూడా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు.

కెనడాలో పర్యటన ముగింపు
నారా లోకేశ్ పర్యటన డిసెంబర్ 10న కెనడాలోని టొరంటోలో ముగుస్తుంది. అక్కడ ఆయన వ్యాపారవేత్తలు, పరిశ్రమల సంఘాలతో సమావేశమై, కెనడా కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్‌కు ఇది రెండో అమెరికా పర్యటన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, ఆయన అంతర్జాతీయ బ్రాండ్ విలువ కారణంగా రాష్ట్రంపై పెట్టుబడిదారుల నమ్మకం పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఈ పర్యటన ఏర్పాట్లను ఏపీ ఎన్ఆర్‌టీ చైర్మన్ డా.వేమూరు రవికుమార్, ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాంలతో పాటు పలువురు ఎన్నారై నాయకులు సమన్వయపరుస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *