Cm chandrababu: రాష్ట్రంలో ప్రజలకు పౌరసేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సుపరిపాలన ద్వారా ప్రజల సంతృప్తిని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టే ఏ అభివృద్ధి పనికైనా గ్రామసభ లేదా వార్డు సభ ఆమోదం తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. ఈ నిబంధన నరేగా పనులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి సమర్థంగా వెళ్లేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై పథకాలు ఎలా అమలవుతున్నాయో సమీక్షించాలని సూచించారు.
పథకాల అమలు, పౌరసేవల లభ్యత వంటి అంశాల్లో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చూపే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు నిర్వహించి అధికారుల పాలనా నైపుణ్యాలను పెంచాలని సీఎం ఆదేశించారు. డేటా ఆధారిత ప్రణాళికలు రూపొందించడం కీలకమని తెలిపారు.
ఇటీవల మొక్కజొన్న, పత్తి, అరటి రైతులు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం సమర్థంగా పరిష్కరించిందని, వారికి గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకున్నామని సీఎం గుర్తుచేశారు.
పాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు త్వరలో ‘అవేర్’ యాప్ను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ యాప్ ద్వారా వాతావరణ హెచ్చరికలు సహా 42 రకాల కీలక సమాచారాన్ని ప్రజలకు అందిస్తారు.
అన్ని శాఖలు డేటా లెక్కు అనుసంధానం కావాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సంక్షేమ హాస్టళ్లలో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలను రోజువారీగా పర్యవేక్షించేందుకు రూపొందించిన యాప్ సక్రమంగా పనిచేస్తోందని అధికారులు సీఎంకు వివరించారు.
తిరుమలలో టీటీడీ అందిస్తున్న సేవలు, భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలను అధ్యయనం చేసి, అదే నమూనాను రాష్ట్రంలోని ఇతర ప్రధాన దేవాలయాల్లో అమలు చేయాలని సీఎం సూచించారు.
కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ సెన్సార్లను ఏర్పాటు చేసి, ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.
సుపరిపాలనపై వచ్చే డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తామని సీఎం తెలిపారు. అధికారుల నైపుణ్యాల పెంపు కోసం శిక్షణా కార్యక్రమాలు కూడా అమలు చేయాలని సూచించారు.
